Friday, April 17, 2020

జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు



జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు 

*********

   శరీరంలో వ్యాధులు రావడానికి ప్రధమ కారణం జీర్ణశక్తి సక్రమంగా లేకపోవడమే జీర్ణశక్తిని వృద్ధి చేసుకుంటే వ్యాధులు దరిచేరవు . సమయానికి తగు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే పుష్టిగా , బలంగా ఉండవచ్చు.

            కొంతమందికి ఒక వయస్సు దాటిన తరువాత జీర్ణశక్తి లోపించడం జరుగుతుంది. వెంటనే వారు ఆయా ఔషదాలు ఉపయోగించుకొని జీర్ణశక్తిని వృద్ది చేసుకోవాలి.

            జీర్ణశక్తిని వృద్దిచేసే కొన్ని ప్రత్యేక ఔషధాలను మీకు వివరిస్తాను.

    శొంఠికొమ్ములను నిప్పులమీద కాల్చవలెను . శొంఠి నిప్పులమీద కాల్చినప్పుడు శుద్ది అగును. కాల్చిన శొంఠిని మెత్తటి చూర్ణంగా చేసి ఒక కప్పు మోతాదులో దానిని తీసుకుని ఆ చూర్ణం మునిగేంతవరకు గింజలు తీసివేసిన నిమ్మరసాన్ని పోయాలి. ఈ విధంగా శొంఠిపొడిని మూడు రోజులపాటు నిమ్మరసంలో నానబెట్టి తరువాత ఒక కప్పు పంచదార దానికి కలిపి పొయ్యిమీద పెట్టి పాకంపట్టి పాకం బిగుసుకున్నాక తరువాత గోళీలు అంత ఉండలు చేసి నిలువచేసుకొని ప్రతి రోజు రెండు ఉండల చొప్పున తీసుకుంటూ ఉంటే అమితమైన జీర్ణశక్తి కలుగును.

   ఎండు ద్రాక్షా , కిస్మిస్ లను గాని తీసుకుని దానికి సమానంగా తేనె మరియు పంచదార కలిపి బాగా నూరి ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ ఒక చెంచా ఔషధాన్ని మూడు పూటలా తీసుకుంటూ ఉంటే అజీర్ణవ్యాధి తగ్గిపోతుంది.

   అల్లం మెత్తగా దంచి దాంట్లో కొంచం సైన్ధవ లవణం కలిపి ఒక సీసాలో ఉంచుకొని రోజూ అన్నం లో మొదటి ముద్దలో ఒక చెంచా వేసుకొని కొంచం నేతిని కూడా కలిపి తీసుకుంటూ ఉండాలి . దీనివల్ల జీర్ణశక్తి బాగా వృద్ది చెందును .

    కరివేపాకు , కొత్తిమీర , పుదినా , చింతచిగురు , చింతపూలు , తులసి ఆకులు ఎక్కువుగా తినడం వలన జీర్ణశక్తి శాశ్వతంగా బాగుంటుంది.

   శొంఠిని కాల్చి ధనియాలు , జీలకర్ర , మిరియాలను కలిపి బాగా నూరి కొంచం ఉప్పు కలిపి అన్నంలో మొదటి ముద్దలో తిన్నా లేదా మజ్జిగలో కలిపి త్రాగినా జీర్ణశక్తి పెరుగును.

    పిప్పిళ్లు కొంచం నెయ్యివేసి  వేయించి చూర్ణం చేసుకుని ఒక కప్పు పొడిని తీసుకుని ఆరుకప్పుల పంచదార పాకం పట్టి పిప్పిళ్ళపొడి పోస్తూ కలపాలి . బాగా బిగుసుకున్న తరువాత చల్లార్చి గోలీలంత  ఉండలు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు పిల్లలు అయితే ఒకటి , పెద్దలు అయితే రెండు చొప్పున రెండు పూటలా తిని పాలు తాగుతున్న జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. లివర్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనం అవుతుంది. ప్రేగులకు మంచి బలాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలు అవుతున్న సమయంలొ ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది.

   కరక్కాయ , పిప్పిళ్లు , శొంఠి , వాము , సైన్ధవలవణం వీటిని సమభాగాలుగా తీసుకుని శొంటిని నిప్పుల మీద కాల్చాలి. పిప్పిళ్ళని నేతిలో వేయించాలి , కరక్కాయలను లోపలి గింజలు తీసివేసి అన్నిటిని కలిపి బాగా దంచి పొడి చేసుకుని రోజూ అన్నంలో నేతిని కలుపుకుని తింటూ వుంటే జీర్ణశక్తి అమితంగా పెరుగును .

      పైన వివరించిన యోగాలలో మీకు సులభంగా అనిపించిన  వాటిని ఉపయోగించుకుని జీర్ణశక్తిని పెంచుకోగలరు


జీర్ణశక్తిని వృద్ధిచేసే సులభ ఔషదాలు 

No comments:

Post a Comment

Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future

  Waste Segregation: One Bin for Each, One Step Toward a Cleaner Future Urbanization and fast-paced lifestyles have increased the amount of...